తెలంగాణలో భారీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు.. ఖర్గే, రాహుల్ హాజరయ్యే ఛాన్స్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది జాతీయ స్థాయి కీలక నేతలు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి పరిథిలోని తుక్కుగూడలో ఈ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఏఐసీసీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ఇక్కడ తెలుగులో విడుదల చేయనుందట కాంగ్రెస్ పార్టీ. అది కూడా మల్లికార్జున ఖర్గే స్వయంగా తెలుగు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారట.
ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న తొలి సభ ఇది. అందువల్ల ఈ సభను భారీగా నిర్వహించాలని, ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు రాష్ట్రంలోని ఇతర కీలక నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.