కూటమిగా పోటీకి ప్రయత్నాలు...
ఇండియా కూటమికి పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్నటివరకూ కాంగ్రెస్పై మండిపడ్డ మిత్రపక్షాలు.. వాస్తవ స్థితిగతులను గుర్తించి, నెమ్మదిగా కార్యాచరణలోకి దిగాయి. ఢిల్లీలో కాంగ్రెస్ తో పార్లమెంటు సీట్లను షేర్ చేసుకోవటానికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో ఆల్రెడీ కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు అయిపోయింది. యూపీలోని 80 సీట్లలో కాంగ్రెస్ కు 17 సీట్లు కేటాయించటానికి ఎస్సీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అంగీకరించారు. ఈ విషయం అఖిలేషే స్వయంగా చెప్పారు. దాంతో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్ కు సజావుగా జరిగిపోయింది.
ఢిల్లీలోని ఏడు పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ తో పంచుకోవటానికి అభ్యంతరం లేదని కేజ్రీవాల్ చేసిన ప్రకటన కూడా సానుకూలతను పెంచేదే అనటంలో సందేహంలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ తో సీట్ల షేరింగ్ కు కేజ్రీవాల్ అంగీకరించారు కాబట్టి పంజాబ్ లో కూడా లోక్ సభ స్ధానాలను కాంగ్రెస్ కు ఆప్ కేటాయిస్తుందనే అనుకుంటున్నారు. ఇది ఒకవిధంగా ఇండియా కూటమి, ప్రత్యేకించి కాంగ్రెస్కు సానుకూల కబురని చెప్పొచ్చు. మరోవైపు బెంగాల్లోనూ సీట్ల పంపకంపై కాంగ్రెస్, టీఎంసీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరుపార్టీ ల మధ్య చర్చలు పూర్తిసానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.ఇక్కడ కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు.
కానీ పొత్తు ధర్మంలో భాగంగా 42 సీట్లకు గానూ రెండు సీట్లిస్తామని మమత ప్రతిపాదించారు. అయితే .. కాంగ్రెస్ అధిక సీట్లను అడగడంపై మమత గతంలో మండిపడ్డారు. దీంతో పొత్తు అంశాన్ని పక్కన పెట్టారు దీదీ. అయితే మళ్ల కాంగ్రెస్, మమత మధ్య చర్చలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనా ఇరుపక్షాలకు అవసరం అన్న సంగతిని ఇండియా కూటమి సభ్యపార్టీలు గుర్తించాయి. దీంతో తమ రాష్ట్రం వరకూ .. కాంగ్రెస్ను భాగస్వామి చేస్తూ, పొత్తు కుదుర్చుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా చేతులు కలుపుతున్నాయని చెప్పొచ్చు.