ఏపీని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్!
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. పదేళ్లు గడిచినా ఆ పార్టీ ఇంకా కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేదు. అయితే ఇప్పుడు షర్మిల రూపంలో ఆ పార్టీకి ఒక ఫేస్ దొరికింది. ఆమె ద్వారా పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని ఎంతో ప్రయత్నిస్తోంది. ఏపీలో మనం గెలవం కదా అని ఆ పార్టీ లైట్ తీసుకోవట్లేదు.. సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. తద్వారా భవిష్యత్తులో మళ్లీ పునర్వైభం సాధించాలనుకుంటోంది.
షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక ఆ పార్టీకి ఊపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వీడిని నేతలను కలిసి ఆమె పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అదే సమయంలో ఇతర పార్టీల్లోని అసంతృప్తులను దారికి తెచ్చుకున్నారు. ఇందులో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వైసీపీలో సీటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వీళ్లందరినీ బరిలోకి దింపడం ద్వారా గణనీయంగా ఓట్లు సాదించవచ్చనే వ్యూహంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి నేతలు ఏ పార్టీలో ఉన్నా వాళ్లందరికీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది.
మరోవైపు షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ వైఎస్ ఫ్యామిలీ వార్ గా మారిపోయింది సీన్. కడపలో షర్మిల గెలిచే అవకాశం లేదు. అయితే అక్కడ గణనీయమైన ఓట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. కడపతో పాటు రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది అభిమానులున్నారు. వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు నమోదయ్యేలా చూడడం పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవేళ పార్టీ గెలవకపోయినా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుమరుగు కావడానికి జగనే కారణం అని ఆ పార్టీ హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీ పెట్టడం ద్వారా ఇక్కడున్న కాంగ్రెస్ నేతలంతా జగన్ వెంట వెళ్లిపోయారు. దీంతో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీన్ని సహించలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల ద్వారా రివేంజ్ తీర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. అందుకే వైసీపీని ఓడించేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తోంది. ఇందుకు డీకే శివకుమార్ తెరవెనుక వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.