గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు : సీఎం రేవంత్
గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వారి ద్వారా మాత్రమే కార్మికులు విదేశాలకు వెళ్లాలని, వారం రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చేలా వ్యవస్థ ఉండాలన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. గల్ఫ్ కార్మికుల సహాయార్థం ప్రజాభవన్లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తాం. ఉపాధి కోసం వెళ్లిన వారి వేతనాలు, బాగోగులు కూడా చూసుకోవాలి. కొన్ని దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఓవర్సీస్ కార్మికుల కోసం పిలిప్పీన్స్, కేరళలో మంచి విధానంలో అమల్లో ఉంది. అన్నీ అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తుంది. గల్ఫ్ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే నిర్ణయించాం అని తెలిపారు.