భద్రతా మండలిలో వీగిన అమెరికా తీర్మానం
గాజాలో తక్షణ, సుస్థిర కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి ( ఐరాస) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. అనుకూలంగా 11 దేశాలు ఓటు వేశాయి. చైనా, రష్యా వీటో చేశాయి. తాత్కాలిక సభ్యదేశం అల్జీరియా తీర్మానాన్ని వ్యతిరేకించింది. గయానా గైర్హాజరైంది. తాము తక్షణ కాల్పుల విరమణకు మద్దతు ఇస్తున్నామని, అయితే తీర్మానంలో వాడిన భాషపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని రష్యా పేర్కొంది. అంతర్జాతీయ సమాజాన్ని అమెరికా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. ఓటింగ్కు ముందు ఐరాసలోని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ మాట్లాడుతూ ఈ కొత్త, కఠినమైన తీర్మానం 15 సభ్యుల భద్రతామండలి ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా కూడా గాజా సంక్షోభానికి సంబంధించిన మూడు తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటు వేసింది. గత నె 20న 13 భద్రతా మండలి సభ్యుల మద్దతుతో అరబ్ దేశాలు ప్రవేశపెట్టిన కాల్పుల విరమణనూ అగ్రరాజ్యం వ్యతిరేకించింది.