చైనా వర్సెస్ ఆకస్ కూటమి..
దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం డ్రాగన్ తెగిస్తోంది. ఆ సముద్ర తీరం మొత్తం తన సొంతం అని ప్రకటించుకున్న చైనా.. పొరుగుదేశాలను బెదిరిస్తోంది. అంతేకాదు.. పక్కనే ఉన్న ఫిలిప్పీన్స్ లాంటి దేశాల పడవలపై జలఫిరంగులతో దాడులు చేస్తోంది. ఈపరిస్థితుల్లో సమతుల్యం సాధించేందుకు అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్, ఆస్ట్రేలియా సంయుక్త విన్యాసాలు ప్రారంభించాయి. అయితే అదే రోజు ఆ దేశాలను కవ్విస్తున్నట్లుగా కంబాట్ పెట్రోల్ ను నిర్వహించింది చైనా.
అయితే ఇప్పటివరకూ హాంకాంగ్, తైవాన్ లకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా.. ఫిలిప్పీన్స్ రక్షణకు నడుం బిగించింది. ఫిలిప్పీన్స్ను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని కొన్నాళ్ల క్రితమే అమెరికా చెప్పిన విషయం తెలిసిందే. అయితే జపాన్, ఫిలిప్పీన్స్ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భేటీ కావడానికి కొన్ని రోజుల ముందే .. మరోసారి దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మరోవైపు...దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ను కట్టడి చేసేందుకు జపాన్ కీలక అడుగువేయనుందని నివేదికలు వస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా నౌకాదళానికి కీలకమైన అణుశక్తి సబ్మెరైన్ల తయారీ ఒప్పందమైన ఆకస్ను విస్తరించి దానిలోకి జపాన్ను కూడా తీసుకొనే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై చర్చలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అమెరికానే ఈ దిశగా చర్యలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కూటమి కృత్రిమ మేధ, డ్రోన్లు, డీప్స్పేస్ రాడార్ల సాయంతో చైనాపై ఎల్లవేళలా నిఘా ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిలో భాగంగా సభ్యదేశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్, జలగర్భ,హైపర్సోనిక్ టెక్నాలజీ, కృత్రిమ మేధ-సైబర్ సాంకేతికను అభివృద్ధిచేయనున్నారు. ఇక ఈ ఒప్పందంలో మొదటి పిల్లర్ కింద ఆస్ట్రేలియాకు అణుశక్తి సబ్మెరైన్లు అందించనున్నారు.
2023లో బ్రిటన్ ఫారెన్ అఫైర్స్ కమిటీ ఆకస్లోకి జపాన్, ద.కొరియాను తీసుకోవాలని సూచించింది. జోబైడెన్ సర్కారు ఆసియాలోని జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటుపై చైనా రుసరుసలాడుతోంది. ప్రాంతీయంగా ఆయుధ పోటీనిని ఇది ఎగదోస్తుందని ఆరోపిస్తోంది.