జయహో బీసీ డిక్లరేషన్..
ఏపీలో ఎన్నికల వేళ జయహో బీసీ డిక్లరేషన్ ను టీడీపీ-జనసేన కూటమి విడుదల చేసింది. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సదస్సులో చంద్రబాబు, పవన్.. బీసీల అభివృద్ధికి చేపట్టనున్న చర్యలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా బీసీలకు 50 ఏళ్లకే పించన్ ఇస్తామన్నాయి విపక్ష కూటమి పార్టీలు. నెలకు రూ.4 వేల పెన్షన్ అందిస్తామని హామీఇచ్చాయి. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు.. విద్యాపథకాల పునరుద్ధరణ, షరతులు లేకుండా విదేశీ విద్య అమలు, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం సహా పలు అంశాల్ని ప్రస్తావించారు.
బీసీల దశ.. దిశ మార్చడం కోసమే డిక్లరేషన్ ప్రకటించామని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ అన్న చంద్రబాబు.. బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాల్సిందిగా కేడర్ కు సూచించారు. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని డిక్లరేషన్ ప్రకటించాం. బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందన్నారు. జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారు. దీని వల్ల 16,800 మంది పదవులు కోల్పోయారు. ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్ పదవులు ఇస్తాం. చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టి, వారి ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేయాల్సిన అవసరముంది.
బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నామన్నారు చంద్రబాబు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 34 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. బీసీలకు ఏటా రూ.15వేల కోట్లు కేటాయిస్తామని జగన్ మోసం చేశారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఇసుక రీచ్లు ఒక కంపెనీకి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. 153 బీసీ కులాల అభివృద్ధికి జనసేన అండగా ఉంటుందని, వారిలో ఐక్యత చాలా అవసరమని పవన్ అన్నారు.
జయహో బీసీ సదస్సులో డిక్లరేషన్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల గలిగితే.. తమ గెలుపు సులభతరం అవుతుందని కూటమి పార్టీలు విశ్వసిస్తున్నాయి. ఇప్పటికే మూడు సభలను నిర్వహించే సరికి.. జగన్ పార్టీ అల్లకల్లోలంగా మారందని.. మరో రెండు సభలు నిర్వహిస్తే... ఇంకెవ్వరూ మిగలరంటున్నారు కూటమి నేతలు చంద్రబాబు, పవన్. మరోవైపు.. తమ గెలుపు ఖాయమంటున్నాయి. వైసీపీ శ్రేణులు. బీసీ సంక్షేమానికి పాటుపడుతున్న వైసీపీకే జనం పట్టం గడతారని చెబుతున్నాయి.