బీజేపీ సెల్ఫ్ గోల్..?
పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు... ఆపార్టీకి తీరని డ్యామేజ్ చేస్తోంది. మణిపూర్ లో మహిళలపై దారుణాలను విపక్షాలు ప్రస్తావిస్తుంటే.... దేశంలో ఇంకెక్కడా జరగలేదా అన్నట్లుగా కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు ప్రస్తావించడం.. ప్రజల్ని సైతం అసహనానికి గురిచేస్తోంది. అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా వితండవాదం దేనికన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంతో బీజేపీకి ఏమైనా సంబంధముందా..? మణిపూర్ ఘటన విపక్షాలకు సంబంధించిన అంశం కాదు.. దేశానికి సంబంధించిన అంశమన్న సంగతి ఎందుకు కేంద్రం గుర్తించడం లేదు..?
మోడీ సర్కార్ ఎన్నో సంక్షేమపథకాలు అమలు చేస్తోంది. దేశాన్ని ఓ దారిన పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఎందరో మేదావులను సలహాదారులుగా కొనసాగిస్తోంది. మరి వారందరికీ ఈ చిన్నవిషయం అర్థం కావడంలేదా..? ఎందుకు మణిపూర్ అంశంపై అవిశ్వాసం వరకూ తెచ్చుకుంది. పైగా దేశంలో ఇతర రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అంశాలను ప్రస్తావిస్తోంది. ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే తప్పకుండా ఖండించాల్సిందే. కానీ మణిపూర్ అంశం అంతకన్నా చాలా సీరియస్ అంశం. ఇది దేశప్రజలకు కూడా తెలుసు.
ఇదే అంశాన్ని అంకుశంలా సంధిస్తున్నారు రాహుల్. మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి మత్తగజంలా వ్యవహరిస్తున్న ఎన్డీయే సర్కార్ పై.. విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాహుల్ అడుగుతున్న ప్రశ్నలకు .. మోడీ సర్కార్ నుంచి సమాధానాలను సాదారణ ప్రజానీకం సైతం ఎదురుచూస్తోంది. అత్యున్నత పదవిలో ఉన్న మోడీ, ఇతర కేంద్రమంత్రులు ఈ చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఇది గెలుపు ఓటములకు సంబంధించిన అంశం కాదు... దేశంలో బాధాగ్రస్తులకు సంబంధించిన అంశం. వారికి ఓదార్పు నివ్వాల్సిన అంశం.
ఈ సందర్భంగా చర్చను పక్కదారి పట్టించేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సైతం జనంలోకి బలంగా వెళ్తోంది. రాహుల్ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం, జయలలిత చీర లాగారన్న మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు...వెరసి విపక్షాలకు మైలేజ్ పెరుగుతోంది. కాదు కాదు.. విపక్షాలకు ఎన్డీఏ సర్కార్ మైలేజ్ పెంచుతోంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం...దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూడడంతోనే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఇప్పటికైనా శాంతి కుసుమాలు విరబూసేలా విపక్షంతో కలిసి అధికారపక్షం ప్రయత్నించాలన్నది యావత్ భారతదేశం యొక్క ఆకాంక్ష. దీన్ని ప్రస్తుత సర్కార్ అర్థం చేసుకుంటుందని ఆశిద్దాం.