అధ్యక్ష పీఠం కోసం మరోసారి.. బైడెన్, ట్రంప్ అభ్యర్థిత్వాల ఖరారు
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి డెమోక్రాటిక్ పార్టీ తరపున జో బైడెన్ నామినేషన్ ఖరారైంది. కేవలం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. తాజాగా జరిగిన ప్రైమరీలో ఆయన గెలుపొందారు. దీంతో పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా ఐలాండ్స్లోనూ ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. తాజాగా వాషింగ్టన్ ప్రైమరీలోనూ ఆయన విజయం సాధించారు. దీంతో నామినేషన్కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు లభించింది. ప్రైమరీల్లోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. చివరి వరకు పోటీగా నిలిచిన నిక్కీ హేలీ సైతం రేసు నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. దీంతో బైడెన్, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు.