ఢిల్లీలో బాలిక హత్య.. లెఫ్టినెంట్ గవర్నర్ను టార్గెట్ చేసిన ఆప్ సర్కారు
ఢిల్లీలో షహాబాద్ ప్రాంతంలో పదహారేళ్ల బాలిక దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. 'ఢిల్లీలో మైనర్ బాలికను బహిరంగంగా దారుణంగా హత్య చేశారు. ఇది చాలా విచారకరం. దురదృష్టకరం. నేరస్తులకు భయం లేకుండా పోయింది. పోలీసులంటే వారికి భయం లేదు. ఎల్జీ సార్.. లా అండ్ ఆర్డర్ మీ బాధ్యత, ఏదైనా చేయండి. ఢిల్లీ ప్రజల భద్రత ప్రధానం' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసందే. దీనిపై వివాదం నేపథ్యంలో ఢిల్లీ ఎల్జీని కేజ్రీవాల్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. శాంతిభద్రతలు, భూమి మినహా అన్ని సేవలపై ఎన్నికైన ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని మే 11న సుప్రీం కోర్టు కూడా తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కేబినెట్ సహచరుడు సౌరభ్ భరద్వాజ్ కూడా ఈ బాలిక హత్య విషయంపై ట్వీట్ చేశారు. ‘ఎల్జీ తన పని చేయకపోతే జవాబుదారి ఎవరు? ఢిల్లీలో శాంతిభద్రతలు అధ్వానంగా తయారయ్యాయి. పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి’ అని ఆయన మండిపడ్డారు.