పిఠాపురంలో వైసీపీ సోషల్ ఇంజినీరింగ్..! వర్కవుట్ అవుతుందా...?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉండడమే ఇందుకు కారణం. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ .. రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో ఈసారి కూడా ఆయన్ను ఓడించి ఇంటికి పంపించాలనే పట్టుదలతో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం పిఠాపురంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా పవన్ కల్యాణ్ ను ఓడించాలనుకుంటోంది.
పిఠాపురంలో మొత్తం 2 లక్షల 30వేల ఓట్లున్నాయి. ఇందులో కాపుల ఓట్లు ఎక్కువ. ఆ తర్వాత బీసీల ఓట్లు కీలకం. కాపుల ఓట్లు సుమారు 95వేల వరకూ ఉన్నాయి. ఆ తర్వాత బీసీలు 85వేల వరకూ ఉన్నారు. ఇందులో మత్స్యకారులు 30వేలు, శెట్టిబలిజ 30వేలు, పద్మశాలి 20వేల ఓట్లు ఉంటాయని అంచనా. ఇక ఎస్సీలు 30వేల వరకూ ఉన్నారు. కాపుల ఓట్లు ఈసారు తమకు పడవేమోననే భయం వైసీపీలో కనిపిస్తోంది. అందుకే బీసీలు, ఎస్సీలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. వాళ్లిద్దరినీ చేరువ చేసుకుంటే కాపులపై ఆధిపత్యం సాధించవచ్చనేది వైసీపీ లెక్క.
ఈసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు 50 శాతం సీట్లను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చామని వైసీపీ చెప్తోంది. అందుకే ఆయా వర్గాలు తమకు అండగా నిలవాలని కోరుతోంది. కాపుల్లోని తమ ఓటు బ్యాంకుకు బీసీలు, ఎస్సీలు మద్దతుగా నిలిస్తే తప్పకుండా పిఠాపురంలో విజయం సాధిస్తామని ఆ పార్టీ నమ్ముతోంది. అందులో భాగంగా మత్స్యకారుతలో మంత్రి దాడిశెట్టి రాజా సమావేశమయ్యారు. అండగా నిలవాలని కోరారు. గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో బీసీలు, ఎస్సీలు ఎక్కువ. అందుకే ఆ రెండు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. చేనేత సంఘాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టి వారిని దగ్గర చేసుకోవాలను ట్రై చేస్తోంది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ పై వైసీపీ తరపున వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈసారి ముద్రగడ పద్మనాభం కూడా తమ పార్టీలో చేరడంతో తప్పుకుండా కాపులు కూడా తమవైపు మొగ్గు చూపుతారని ఆశలు పెట్టుకుంది. అయితే పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, కాపులకు ఆశించినంతగా జగన్ ఏమీ చేయకపోవడం, టీడీపీ తీసుకొచ్చిన రిజర్వేషన్లను జగన్ అమలు చేయకపోవడం లాంటివి కాపుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. దీంతో కాపులు ఈసారి పూర్తిగా పవన్ కు అండగా నిలుస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. అందుకే బీసీ, ఎస్సీలపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. మరి వాళ్లు వైసీపీని గట్టెక్కిస్తారా లేదా అనేది వేచి చూడాలి.