పాలకుల చేతుల్లో పావులుగా మారుతున్న అధికారులు..!!
కాలం మారుతోంది. అందుకు తగ్గట్లే మనుషులు కూడా మారిపోతున్నారు. గతంలో పాలకులు విలువలు, విశ్వసనీయత లాంటి వాటికి పెద్దపీట వేసేవారు. మాటిస్తే తప్పేవారు కాదు. కానీ ఇప్పుడు అవేమీ లేవు. అధికారంకోసం అడ్డదారులు తొక్కడానికి ఎలాంటి పనైనే చేసేందుకు వెనుకాడట్లేదు. మరింత బరితెగించి చట్టాలను కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. పాలకుల బారి నుంచి వ్యవస్థలను కాపాడాల్సిన అధికారులు కూడా అందులో పావులు కావడం ప్రజాస్వామ్యానికే సవాల్ గా మారుతోంది.
మనది నాలుగంచెల రాజ్యాంగ వ్యవస్థ. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ఏదైనా వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే దాన్ని సరిదిద్దే బాధ్యతను మరో వ్యవస్థ తీసుకోవడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అయితే ఇప్పుడు వ్యవస్థలన్నీ కుమ్మక్కైపోయినట్లు కనిపిస్తోంది. తప్పులను కూడా కవర్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాయి. ఒకదాని తప్పులను మరొకటి ఎత్తి చూపకపోగా అందులో భాగస్వామ్యులవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లుగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్న పార్టీలకు, నేతలకు అధికారులు వంత పాడారు. వాళ్లు ఏం చెప్తే అది చేశారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్యోన్ ట్యాపింగ్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇందులో పాలకులు సైడై పోయారు. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నది మాత్రం అధికారులే. ఏపీలో గత చంద్రబాబు పాలనలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావు పరిస్థితి కూడా ఇంతే. గతంలో ఓ వెలుగు వెలిగిన ఆయన జగన్ అధికారంలోకి వచ్చాక అనేక కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కూడా కొంతమంది అధికారులు వంత పాడుతున్నారు. దీంతో కోర్టుల్లో మొట్టికాయలు తినాల్సి వస్తోంది.
తాజాగా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీడియాను టార్గెట్ చేస్తూ విడుదల చేసిన లేఖలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. అదే సమయంలో మీడియా కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని వాళ్లను మరింత టార్గెట్ చేస్తోంది. ఇప్పుడున్న ప్రభుత్వం అండగా ఉండడంతో అధికారులు దర్జాగా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం మారితే ఇలాంటి అధికారులకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వాలు మారుతుంటాయి.. కానీ అధికారులు శాశ్వతం. గతంలో అధికారులు ప్రభుత్వం చెప్పిన ప్రతిదానికీ తలూపే వారు కాదు. దీంతో వ్యవస్థల్లో నీతి నిజాయితీ కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఇది కచ్చితంగా అధికారుల వల్లే అని చెప్పొచ్చు.