కోకాపేటలో కోట్ల వర్షం.. అవి భూములా..? బంగారమా..?
హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. రోజురోజుకూ కొత్త అవతారం ఎత్తుతోంది. ఒకప్పుడు పాతబస్తీ, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, సికింద్రాబాద్.. లాంటి ప్రదేశాలను మాత్రమే జనాలకు తెలుసు. కానీ ఇప్పుడు సైబరాబాద్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, మహేశ్వరం, ఫార్మా సిటీ, నియోపోలిస్.. లాంటి పేర్లు కొత్తగా వెలిశాయి. ఇప్పుడు నగరమంతా హైటెక్ హంగులతో మెరిసిపోతోంది. ఆకాశాన్నంటుతున్న భవంతులు, అత్యాధునిక వసతులు నగరవాసి జీవనంలో భాగమైపోయాయి. హైదరాబాద్ లో ఇళ్లు కొనేందుకు జనం ఎగబడుతున్నారు. భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి.
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ – హెచ్ఎండీఏ తాజాగా కోకాపేటలో పలు ప్లాట్లను వేలం ద్వారా విక్రయించింది. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరం ధర వంద కోట్లకు పైగా పలికింది. సర్వే నెంబర్ 239, 240లలో నియోపోలిస్ పేరుతో ప్రత్యేక లే ఔట్లను డెవలప్ చేసింది హెచ్ఎండీఏ. పదో నెంబర్ లేఅవుట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది. ఇందులో 3.6 ఎకరాలున్నాయి. అందుకే దీన్ని చేజిక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు ఎకరం రూ.100.75 కోట్ల ధర పలికింది. దీంతో మొత్తం భూమికి ప్రభుత్వానికి రూ.362.70కోట్లు వచ్చాయి. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, హ్యాపీ హైట్స్ నియో పోలిస్ కలిపి ఈ వెంచర్ ను చేజిక్కించుకున్నాయి. ఇదే ఇప్పటివరకూ హైదరాబాద్ లో గరిష్టంగా పలికిన ధర.
ఇది మాత్రమే కాకుండా మరిన్ని లే అవుట్లకు కూడా హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. మొత్తం 45.33 ఎకరాలకు వేలం నిర్వహించగా రూ.3319.60 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సరాసరిన ఎకరా ధర రూ.73.23 కోట్లు పలికింది. కోకాపేటలో నియోపోలిస్ పేరుతో 531.45 ఎకరాల భూమిని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు.. లాంటి మౌలిక వసతుల కల్పనకోసమే రూ.450 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గతంలోనే 202.23 ఎకరాల భూమిని వేలంలో విక్రయించారు. అప్పట్లో అత్యధికంగా ఎకరం ధర రూ.60 పలికింది. మొత్తం రూ.2వేల కోట్ల ఆదాయం లభించింది. ఇప్పుడు అంతకుమించి ధర పలకడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరినట్లయింది.
సాధారణంగా హైదరాబాద్ లో అంత పెద్ద స్థాయిలో స్థలం దొరకడం చాలా కష్టం. అదీ క్లియర్ టైటిల్ ఉన్న భూములు చాలా తక్కువ. ప్రభుత్వమే ఈ భూములను అభివృద్ధి చేసి విక్రయిస్తుండడంతో ఎలాంటి సమస్యలూ ఉండవు. అందుకే వీటిని చేజిక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఎగబడ్డాయి. త్వరలోనే మరిన్ని భూములను కూడా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంతకుమించిన ధర పలుకుతుందనే ఆశాభావంతో ఉంది.