రాజధాని రైతులకు భువనేశ్వరి విరాళం
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతుల నిరసన దీక్షలు 15వ రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నా. ఏపీని ప్రథమ స్థానంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నిరంతర కృషి చేశారు. ప్రజల తర్వాతే నన్ను, కుటుంబాన్ని పట్టించుకునేవారు. ఎప్పుడూ అమరావతి, పోలవరం అని చంద్రబాబు తపించారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు. రైతులకు పూర్తిగా మద్దతుగా మా కుటుంబం అండగా ఉంటుంది. అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరు అని తెలిపారు.
భువనేశ్వరి ఇచ్చిన గాజులను బహిరంగవేలం వేసి తద్వారా వచ్చిన డబ్బును ఉద్యమానికి వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. వివిధ సంఘాలు ఇచ్చిన రూ.50 వేల విరాళాన్ని కూడా ఎర్రబాలెం రైతు పోరాట కమిటీకి అందించారు. ఇతర ప్రజా సంఘాలు, ప్రజలు ఎవరికీ తోచిన విధంగా వారు ఆర్థిక సాయం చేశారు.