ఐటి ఉద్యోగుల ఉద్యోగ భద్రత డొల్లే…
ఐటికంపెనీల్లో ఉద్యోగం రావడం కలగా భావించే రోజులకు కాలం చెల్లింది. ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదవడం, హైదరాబాద్కు చేరుకుని ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం సంపాదించడం, ఆకర్షణీయమైన వేతనంతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చనే భ్రమల నుంచి ఇప్పుడిప్పుడే యువత బయటపడుతోంది. విప్రో సంస్థ దాదాపు ఆరు వందల మంది ఉద్యోగులను, కాగ్నిజెంట్ సంస్ధ ఆరు వేల మందిని, ఇన్ఫోసిస్ సంస్ధ 9 వేల మందిని దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న తమ కంపెనీల నుంచి లే ఆఫ్ ప్రకటించి ఉద్వాసన పలికినట్లు సమాచారం.
పెద్ద కంపెనీలుగా బ్రాండ్ పడిన కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, విఫ్రో, ఇన్ఫోసిస్, వెరిజాన్ తదితర సంస్థల్లో దేశ వ్యాప్తంగా ఆ కంపెనీల యాజమాన్యాలు లే ఆఫ్లను ప్రకటించాయి. నైపుణ్యత లేదనో, ఆశించిన మేరకుపనిచేయడం లేదనో, ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సివ స్తుందనే కారణంతో ఐటి ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ ధోరణి 2017లో విపరీత స్థాయికి దారి తీసింది. దీంతో ఐటి ఉద్యోగుల ఉద్యోగ భద్రత నిమిత్తం కోర్టులను, మానవ హక్కుల సంఘాలను, కార్మిక శాఖను ఆశ్రయిస్తున్నారు. కొన్ని కంపెనీల్లో బౌన్సర్లను పెట్టి ఉద్యోగులను కంపెనీల్లోకి రానివ్వడం లేదు. ఉద్యోగులకు ఇది ఆశించిన స్థాయిలో మంచి సంవత్సరం కానే కాదని ఫోరం ఫర్ ఐటి ఎంప్లారుూస్ ప్రతినిధి కిరణ్ చంద్ర అన్నారు.