ఆటా సేవలు భేష్...
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, కాబోయే అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గద్వాలలోనూ, వరంగల్లోనూ, విశాఖపట్టణంలోనూ ఈ కార్యక్రమాలు జరిగాయి. పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు, ఆరోగ్యశిబిరాలు, సాంస్కృతిక సమ్మేళనం వంటి కార్యక్రమాలను సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోనూ చల్లా లింగారెడ్డి జిల్లాపరిషత్ హైస్కూల్లో జరిగిన ఆటా వేడుకల్లో దాదాపు 60 మంది ప్రతిభ చూపిన విద్యార్థులకు స్కాలర్ షిప్లను, 1400 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాల సామాగ్రిని అందజేశారు. వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలోని జడ్పి హైస్కూల్లో డిజిటల్ క్లాస్రూమ్ను, కంప్యూటర్ ల్యాబ్ను, పర్వతగిరిలో డిజిటల్ క్లాస్రూమ్ను, వెలార్త్లో డిజిటల్ క్లాస్రూమ్లను ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి మండలం చిన్నఅముదాలపాదులో పలు అభివృద్ధికార్యక్రమాలను ఆటా సేవాడేస్లో భాగంగా ప్రారంభించింది.
స్థానిక పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, డ్యూయల్ డెస్క్, వాటర్ ట్యాంక్, నీటిశుద్ధి కేంద్రంతోపాటు ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని పడ్కల్లో మెగా హెల్త్ క్యాంప్ను ఆటా నిర్వహించింది. ప్రకాశం జిల్లా దైవాలరావూరులో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి వైద్యపరీక్షలను చేసింది. నల్లగొండ జిల్లాలో మెగా హెల్త్ క్యాంప్ను అపోల్ హాస్పిటల్ సహకారంతో విజయవంతంగా నిర్వహించింది. దాదాపు 700 మందికి వైద్యపరీక్షలను జరిపింది. నిజామాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల దినోత్సవ సన్నాహక సదస్సులో ఆటా కూడా పాల్గొంది. మహబూబ్నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అమెరికాలో ఉన్నతవిద్యపై సదస్సును నిర్వహించింది. హైదరాద్లోని శ్రీవాహినిలో చైతన్యసదస్సును కూడా నిర్వహించింది. టికెఆర్ గ్రూపు ఇన్స్టిట్యూట్లో విద్యారంగంపై సెమినార్ జరిపింది. డిసెంబర్ 22వ తేదీన హైదరాబాద్లోని ఐటీ హబ్లో బిజినెస్ సెమినార్ను నిర్వహించి అమెరికా వీసా, ఐటీ సంబంధించిన వ్యవహారాలపై చర్చించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ సెమినార్ను నిర్వహించింది.