ASBL NSL Infratech

టాంటెక్స్ ఆధ్వర్యంలో డాల్లస్ లో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

టాంటెక్స్ ఆధ్వర్యంలో డాల్లస్ లో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

ముత్యాల ముగ్గులు.. రత్నాల గొబ్బిళ్లు.. భోగిమంటలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లు.. కోడిపందేలు.. సంక్రాంతి వచ్చిందంటేనే సంబరం ఎక్కడ లేని ఉత్సాహం. ఊరికి, దేశానికి దూరంగా అమెరికా లో ఉన్న తెలుగు వారికి వారికి  ఈ పండగ అంటే ఇంకా మమకారం. వారు కూడా సంక్రాంతి పండుగను అంతే ఘనంగా జరుపుకొనేలా, అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన టాంటెక్స్ వారు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు.  తెలుగు వారి సాంస్కృతిక వారధి, మూడు దశాబ్దాలకి పైబడి వారి మనసులు చూరగొంటున్న టాంటెక్స్ వారు ప్రత్యేక శ్రద్ధ తో ఈసారి కూడా చక్కని కార్యక్రమాల సమాహారాన్ని సమర్పించింది.

ఈ సందర్భంగా  స్థానిక  ఫ్రిస్కో హైస్కూల్ లో ఏర్పాటు చేసిన “సంక్రాంతి సంబరాలు”  అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2019 అధ్యక్షులు చినసత్యం వీర్నపు మరియు కార్యక్రమ సమన్వయకర్త ప్రబంధ్ రెడ్డి తోపుడుర్థి ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త సమీర ఇల్లెందుల  ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు  టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యులు సభా ప్రాంగణం అలంకరించారు.  స్థానిక బావార్చి ఇండియన్ రెస్టారెంట్ వారు పండుగ భోజనం వడ్డించారు. సుమారు 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన  తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటలకు, తెలుగింటి ఆచారాలను, వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేసిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది. ప్రధాన వ్యాఖ్యాత సమీర ఆద్యతం నవ్వుల జల్లులు కురిపించారు. చిన్నారులు సాహితి, సింధూర, సమన్విత ఆలపించిన 'పాడరా ఓ తెలుగు వాడా' ఆహుతులని మంత్ర ముగ్దులని చేసింది. డేశభక్తి గీతాలు, సినిమా పాటల ప్రదర్శన, వినరో భాగ్యము విష్ణు కథ  అంటూ సాగే సంప్రదాయక కూచిపూడి నృత్యాలతో  కార్యక్రమాలు ముందుకు కొనసాగాయి. 'రామ సీత మధుర క్షణాలు' నృత్య నాటిక,  తిల్లాన, శివ తాండవ నృత్యాలు  ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యకులు క్రిష్ణవేణి శీలం మాట్లాడుతూ, గత సంవత్సరం తనకు సహకరించిన కార్యవర్గ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారిద్వారా తెలుగు వారి సేవ చేసే భాగ్యం తనకు దక్కడం ఆదృష్టంగా భావిస్తునాను అన్నారు. నూతన అధ్యక్షుడికి, మరియు కార్యవర్గానికి స్వాగతం చెబుతూ తనవంతు సహాయ సహకారాలు ఎప్పటికి అందుబాటులో ఉంటాయన్నారు.

తదుపరి, 2019 వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మాట్లాడుతూ ఉత్తర అమెరికా ఖండంలో తెలుగు సంగీత, సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తూ, అన్ని జాతీయ సంస్థలకు ధీటుగా, గత 33 సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ ముఖ్యోద్దేశ్యంగా, సేవలందిస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2019 లో అందరి సహాయ సహకారాలతో వినూత్న కార్యకలాపాలతో తెలుగు పల్లకిని మోసుకెళ్ళడానికి మంచి ప్రణాళికతో రంగం సిద్ధం చేస్తున్నాను. టాంటెక్స్ సంస్థ కార్యక్రమాలు జయప్రదం కావడానికి సభ్యులు కూడా భాగస్వామ్యులై, అవసరమైన ఆర్ధిక సహాయం,  ప్రోత్సాహక సూచనలు, కార్యక్రమాల హాజరు తదితర అంశాలతో చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పారు.

తదనంతరం 2019 నూతన పాలక మండలి,  కార్యనిర్వాహక బృందాన్ని, సభకు పరిచయం చేశారు. ఈ సంక్రాంతి సంబరాలకి ప్రత్యేకంగా విచ్చేసి అందరిని ఎంతో ఆనందపరచిన  ముఖ్య అతిథులు శ్రీకాంత్ సండుగు, శిల్పా రావ్ ని జ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాని పాత్రా పుష్పగుచ్చాలతో సన్మానం చేయడం జరిగింది.2019 పోషక దాతల నందరిని కృష్ణారెడ్డి కోడూరు  పరిచయం చేయగా చినసత్యం మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు.

“సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త ప్రబంధ్ రెడ్డి తోపుడుర్థి, ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన బావార్చి ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. అటు పిమ్మట ఈ కార్యక్రమ ప్రసెంటింగ్ స్పాన్సర్స్ నితిన్ రెడ్డి శీలం, నాట్స్, ఇందిర అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలి ఈవెంట్ స్పాన్సర్స్ డా. ఉరిమిండి నరసిం హారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ అండ్ ఫ్యామిలీ, మనోహర్ కసగాని, ఉమామహేష్ పార్నపల్లి అండ్ ఫ్యామిలీ, శరత్ రెడ్డి యర్రం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి ఇండియన్ రెస్టారెంట్, ప్రసూనాస్ కిచెన్, క్వాంట్ స్విస్ టంస్, ఆల్బెర్ట్ సంతయ్య ఆఫ్ యెడ్వార్డ్ జోన్స్, విక్రం జంగం, డా. పవన్ పమడుర్తి, ప్రతాప్ భీమిరెడ్డి, శ్రీకాంత్ పోలవరపు మరియు గోల్డ్ పోషక దాతలైన పసంద్ రెస్టారెంట్, విష్ పాలెపు సి.పి.ఏ,  మైటాక్స్ ఫైలర్, మైటాక్స్ ఫైలర్, రాం కొనార, మెహతా జూలెర్స్, అడయార్ ఆనంద్ భవన్, బసేర ఇండియన్ రెస్టారెంట్, కిషొర్ చుక్కాల మరియు సిల్వర్ పోషక దాతలైన  సిం-పర్వతనేని-బ్రౌన్ లా ఆఫీసెస్, మురళి వెన్నం, డా. సుమన కేత, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్ లకు  ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియ జేసారు. “గాన సుధ - మన టాంటెక్స్ రేడియో” ప్రసారం చేయడానికి సహకారం అందిస్తున్న ఫన్ ఏసీయా, ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీ, ఏక్ నజర్, TNILive లకు కృతఙ్ఞతలు తెలియచేసారు.

ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియజేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో, అత్యంత వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాలు ముగిసాయి.

Click here for Event Gallery

 

Tags :