ASBL NSL Infratech

డల్లాస్ లో చదలవాడ కృష్ణమూర్తి గారికి సన్మానం

డల్లాస్ లో చదలవాడ కృష్ణమూర్తి గారికి సన్మానం

అమెరికాలో వివిధ నగరాల్లో టీటిడి ఆధ్వర్యంలో జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి  చైర్మన్‌ డాక్టర్‌ చదలవాడ కృష్ణమూర్తిని డాలస్‌లోని తెలుగువాళ్ళు ఘనంగా సన్మానించారు.

డాలస్‌ తెలుగు ప్రముఖుడు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర అధ్యక్షతన డాలస్‌లోని హిల్‌టాప్‌ రెస్టారెంట్‌లో జరిగిన అభినందన సభలో 300కు పైగా తెలుగువాళ్ళు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవాలయంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయాలన్నింటిని అనుసంధానం జేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ అనుసంధానం ద్వారా విదేశాల్లో ముఖ్య నగరాల్లో ఉన్న  దేవాలయాల ద్వారా శ్రీ వారి ప్రసాదం, ఆధ్యాత్మిక పుస్తకాలు, సిడిలు, డివిడిలు పంచడానికి  అవకాశం ఏర్పడుతుందన్నారు.

అలాగే ఇతర దేశాల్లో ఉన్న  దేవాలయల పురోహితులకు ఆగమ శాస్త్ర ప్రకారం జరపాల్సిన శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణం, పూజా విధానం, వివిధ సంప్రదాయ విధానాలపై శిక్షణ ఇవ్వడం ద్వారా అన్ని దేవాలయాల్లో ఒకే పద్దతి పాటించేందుకు వీలవుతుందన్నారు.  ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకు వేదాలు, సంస్కృతంలో తరగతులు నిర్వహించే వారిలో హైందవ ధర్మం పట్ల అవగాహన, అభిరుచిని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీవారి నగలు, ఆస్తులు, నెలవారీ ఆదాయ వ్వవాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరచడం ద్వారా ఎన్నో అపోహలను తొలగించవచ్చని అన్నారు. దేవుడు ముందు అందరూ సమానమేనని, సాదారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విదేశాలనుండి తిరుమల వచ్చే వారి సమయాభావం దృష్ట్యా త్వరితగతిన శ్రీ వారి దర్శనం భాగ్యం కలిగేలా చూడాలని కోరారు.  దేవాలయ ప్రాంగణ పరిశుభ్రత, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

తరువాత టీటిడి చైర్మన్‌ మాట్లాడుతూ, డాక్టర్‌ తోటకూర చేసిన  సూచనలను స్వాగతిస్తున్నానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృత నిశ్చయంతో ఉందని, ఇప్పటికే ఈ దిశఘా అనేక  మార్పులు తీసుకు వచ్చామని, ఒక్క రోజులో లక్ష మంది భక్తుల దర్శన సౌకర్యం కలిగించి రికార్డ్‌ సృష్టించామన్నారు. డాలస్‌లో జరిగిన శ్రీ వారి కళ్యాణం అద్భుతంగా జరిగిందని, ఈ కార్యక్రమం తమకు మరెన్నో కళ్యాణాలు జరిపేందుకు స్పూర్తిని కలిగించిందన్నారు. ఈ కళ్యాణ నిర్వహకులు  గోపాల్‌ పోనంగి, పులిపాక సత్యనారాయణ, రావు కల్వల, శ్యామల రుమాళ్ళ. ఆర్‌.కే. పండిటి, శ్రీనివాస్‌ పమిదిముక్కల, నగేష్‌, మొదలైన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభినందన సభలో టిటిడి జేఈవో పోలా భాస్కర్‌, ఎపిక్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు, తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌, చెన్నూరి సుబ్బారావు, టిటిడి అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :