Tamil politics: డీఎంకేను గద్దెదింపి తీరతా.. తమిళనాడు బీజేపీ చీఫ్ భీషణ శపథం..

తమిళనాడు పాలిటిక్స్ రసకందాయంలో పడ్డాయి. ఉదయిస్తున్న సూర్యుడిపై.. కమలం కారాలు, మిరియాలు నూరుతోంది. గత ఎన్నికల్లో మిత్రులతో కలిసి డీఎంకేను గద్దెదింపుదామని భావించిన కమలనాథులు.. స్టాలిన్ వ్యూహాల ముందు తేలిపోయారు.అయితే ఆరాష్ట్ర బీజేపీ చీఫ్ మాత్రం.. డీఎంకేను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇటీవల అన్నా యూనివర్సిటీలో(Anna university) విద్యార్థినిపై లైంగిక దాడి అంశంలో అన్నామలై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ (Women security)లేదంటూ.. ఇకపై తాను రెగ్యులర్ రాజకీయాలు చేయబోనని అన్నారు. డీఎంకేను గద్దె దించేందుకు శుక్రవారంనాటి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి సుబ్రహ్మణ్యస్వామిని(Subramainiyan swamy) వేడుకుంటానని తెలిపారు. డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ తనకు తాను కొరడా దెబ్బలు శిక్షగా ఇచ్చుకున్నారు అన్నామలై.
బీజేపీ కార్యకర్తలంతా తమ ఇంటి ఎదుట డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల్లోని బాధిత మహిళలు, వారి కుటుంబాలకు బీజేపీ శ్రేణులు అండగా నిలవాలన్నారు రాష్ట్ర బీజేపీ ఛీఫ్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్కు కూడా లేఖ రాయనున్నట్టు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించలేని పార్టీకి.. అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. తమిళనాడులో నాగరిక రాజకీయాలు తావు లేనందున.. ఇక నుంచి తన రాజకీయాలు భిన్నంగా ఉంటాయని అన్నామలై అన్నారు.
అంతేకాదు… డీఎంకేను అధికారం నుంచి దించే వరకు చెప్పులు వేసుకోనని, మీడియా సమావేశం అనంతరం బూట్లు విప్పబోనని ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే పాలన ముగిసిన తర్వాతే బూట్లు ధరిస్తానని, 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మురుగన్లోని ఆరు ఇళ్లను సందర్శించి డీఎంకే వ్యతిరేక రాజకీయాలను చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తానని అన్నామలై చెప్పారు.
అన్నా యూనివర్శిటీలో సీసీ కెమెరా లేదని అనడం సిగ్గుచేటన్నారు అన్నామలై. నిర్భయ ఫండ్ కేటాయించినా.. అన్నా యూనివర్శిటీలో కనీసం సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అన్నా యూనివర్సిటీ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ను బహిర్గతం చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.