తమిళనాడు లో విషాదకర సంఘటన... ఎన్నికల్లో టికెట్ రాలేదని
లోక్సభ ఎన్నికల ముందు తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత గణేశమూర్తి(77) కన్నుమూశారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆయన ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో ఎండీఎంకే కు ఈరోడ్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా, అక్కడి నుంచి దురైవైగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గణేశ్మూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మార్చి 24న ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ తర్వాత పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు.