అవన్నీ రూమర్లేనన్న వంశీ
ఆర్జీవీ నుంచి సందీప్ రెడ్డి వరకు అందరూ బాలీవుడ్ లో తమ స్థామినాను నిరూపించుకుని అక్కడ జెండా ఎగరేసిన వాళ్లే. టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ లో సినిమాలు చేసి చాలా హిట్లే అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా హవా నడుస్తోంది. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సందీప్, తర్వాత యానిమల్ తో పెద్ద హిట్ కొట్టి మరో సినిమాను సెట్ చేసుకున్నాడు.
ఈ క్రమంలో మరికొందరు టాలీవుడ్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. వారిలో గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ, వంశీ పైడిపల్లి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత రెండ్రోజులుగా వంశీ పేరు నెట్టింట తెగ వినిపిస్తోంది. షాహిద్ కపూర్ కు వంశీ ఓ లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడని ప్రచారం జరుగుతుంది.
ఈ వార్త గురించి ఓ ఇంగ్లీష్ మీడియా వంశీని అడగ్గా, అదంతా కేవలం రూమరేనని కొట్టిపారేశాడు. మరి మీ తర్వాతి సినిమా ఎప్పుడు? ఎవరితో ఉంటుందని అడిగితే ప్రస్తుతం దాని మీదే వర్క్ జరుగుతుందని, సరైన టైమ్ లో ఆ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ వస్తుందని వంశీ తెలిపాడు. వంశీ నుంచి చివరగా వచ్చిన సినిమా వారసుడు. మరి వంశీ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి.