ప్రత్యర్థులపై మాటల దాడి యాత్ర గా సాగిన.. అరకులో షర్మిల న్యాయ యాత్ర..
షర్మిల నిర్వహిస్తున్న ఏపీ న్యాయయాత్రలో భాగంగా 19వ రోజు ఎన్నికల ప్రచారం అరకులో కొనసాగించారు. ఈ నేపథ్యంగా ఆమె మాట్లాడుతూ నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసీల అభివృద్ధికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని..కార్పొరేషన్ లోన్లు ఇప్పించారని.. స్వయం ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆదివాసీల గురించి పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారని బాధపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఆ తర్వాత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పటికీ అరకులో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని ఆమె అన్నారు. 600 కోట్లతో టూరిజం డెవలప్మెంట్ చేశారని జగన్ చెబుతున్నారు.. కానీ నాకది కనిపించడం లేదు. ఇంతకీ మీ టూరిజం మినిస్టర్ ఎవరు.. రోజా ఆట కదా.. అదే జబర్దస్త్ రోజా. ఆమె మాత్రం జబర్దస్త్ గా ఉండాలి.. కానీ అరకు ఏమైనా పర్వాలేదు.. టూరిజం మినిస్టర్ గా ఉన్న రోజా ఒక్కసారైనా అరకు వచ్చారా.. మరి అలాంటి వారికి మీరు ఎందుకు ఓటు వేయాలి అని మాట్లాడారు. అంతేకాదు అప్పట్లో బీజేపీ ఇక్కడ ఒక ట్రైబల్ యూనివర్సిటీ, నెలకొల్పుతామన్నారు కానీ ఆ పని చేశారా.. అంటూ అందరి గురించి వ్యాఖ్యానించారు. మొత్తానికి వాళ్లు వీళ్లు చేయని దాని గురించి చెప్పారే తప్ప.. తాము ఏమి చేయదలుచుకున్నామన్న విషయంపై షర్మిల లైట్ గా వెళ్లారు. షర్మిల ఈ వ్యవహార శైలి వల్లే రాను రాను ఆమె ప్రసంగాలను జనం కూడా లైట్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు.