Chaitanya Rao: చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చైతన్య రావు (Chaitanya Rao) మదాడి, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్ .5 ని ప్రారంభించారు. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు రెడీగా ఉన్నారు. గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీని శుక్రవారం (అక్టోబర్ 3) నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో..
దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ .. ‘ఇది నాకు ఐదో చిత్రం. చైతన్యతో రెండో సినిమా. పూర్ణా నాయుడు, శ్రీకాంత్ గార్లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఐరా తెలుగులోకి హీరోయిన్గా పరిచయం కాబోతోన్నారు. సాఖీ బెంగాలీలో సీరియల్స్ చేశారు. ఈ మూవీతో ఆమె కూడా తెలుగులోకి రాబోతోన్నారు. చైతన్య, పూర్ణ గార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తరువాత పూర్ణ గారితో ఓ మూవీని చేయాలి. హిట్స్లో ఉన్నప్పుడు చేయను.. బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణ గారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోంది. అందమైన లొకేషన్లలో భారీగా ఈ మూవీని చిత్రీకరిస్తున్నామ’ని అన్నారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ .. ‘శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు బ్యానర్లో పూర్ణా నాయుడు, శ్రీకాంత్ నిర్మాతలుగా క్రాంతి మాధవ్ అన్న దర్శకత్వంలో మూవీని చేస్తున్నాను. క్రాంతి అన్నతో నాది మూడేళ్ల బంధం. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాను. 2026లోనే ఆయనతో చేస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చాలా ఇష్టమైన సినిమా. ఆయనకెంతో ఇష్టమైన దర్శకుడు. ఆయనతో వరుసగా రెండు చిత్రాలు చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇంత కంటే ఎక్కువగా నేను ఆ దేవుడ్ని ఏదీ కోరుకోను. ‘మయసభ’, ‘ఘాటీ’ తరువాత ఇంత మంచి సినిమాను చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఓ సినిమా చేస్తున్నాను అంటే.. ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనే ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. క్రాంతి అన్న చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఐరా, సాఖీలకు ఆల్ ది బెస్ట్. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ .. ‘క్రాంతిని నేను దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ ఇన్నాళ్లకు మా ఇద్దరికీ సమయం కుదిరింది. క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్ నా ప్రతీ ప్రాజెక్ట్లో భాగస్వామి అవుతూనే ఉంటారు. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తామ’ని అన్నారు.
హీరోయిన్ ఐరా మాట్లాడుతూ .. ‘నాది బెంగళూరు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను తెలుగులోనే ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది. కానీ తమిళంలో నా పరిచయం జరిగింది. నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే చిత్రం చాలా ఇష్టం. నేను ఆ మూవీని దాదాపు 20 సార్లు చూసి ఉంటాను. క్రాంతి గారి నుంచి నాకు ఫోన్ రావడంతో చాలా సంతోషించాను. కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్లో భాగం అవ్వడం నా అదృష్టం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. చైతన్యతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.