ఇంచార్జ్ల మార్పు వెనక..?
ఒకేసారి 11 మంది ఇంచార్జ్ల మార్పు.. వైసీపీని ఓ కుదుపు కుదిపింది. ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న చోట్ల.. నియోజక వర్గ ఇంచార్జిలను మార్చేశారు సీఎం జగన్. మరికొందరికి పదవీగండం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీలో సీనియర్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీంతో తమ పరిస్థితి ఏంటి..? రాబోయే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని, గెలవాలని వ్యూహాలతో ఉన్న సమయంలో.. ఇలా మార్చేస్తే ఎలా అని టెన్షన్ పడుతున్నారు.
2019 ఎన్నికల్లో తిరుగులేని జనాదరణతో 151సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీ.. 2024లో రెండోసారి గెలుపు సాధించాలని భావిస్తోంది. సంక్షేమమంత్రంలో ఎన్నికల సముద్రాన్ని సునాయాసంగా ఈదేస్తామని విశ్వాసంతో ఉంది. అయితే పొరుగున ఉన్న తెలంగాణలో సంక్షేమపథకాలతో పాటు అభివృద్ధిని మేళవించి కేసీఆర్ సర్కార్ ముందుకెళ్లింది. కానీ ఓటర్లు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థుల అవినీతి, అక్రమాలను సీరియస్గా పరిగణించారు. ఫలితంగా బీఆర్ఎస్ సర్కార్కు షాక్ తగిలింది. దీన్ని పాఠంగా తీసుకున్న సీఎం జగన్.. నియోజకవర్గ ఇంచార్జ్లను ఉన్నపళంగా మార్చేశారు. ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న ఇంచార్జ్లను పక్కనపెట్టారు. కొత్తవారికి అవకాశం కల్పించారు.
రెండు-మూడు జిల్లాలకే 11మందిని మార్చేస్తే.. మిగిలిన చోట్ల పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైంది. ఇచ్చాపురం మొదలుకుని కుప్పం వరకూ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎవర్ ఇన్.. ఎవరు అవుట్.. ఎవరికి ట్రాన్సఫధర్ అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మార్చడమైతే ఖాయమన్న మెసేజ్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు అంతర్గతంగా వెళ్లిపోయింది. అందుకే కొంతమంది సైలంట్ గా ఉంటే.. మరి కొంత మంది పక్క చూపులు చూస్తున్నారు. పార్టీలోని ముఖ్యుల నుంచి అందిన సమాచారం మేరకు 65 స్థానాల్లో అభ్యర్థులు మారనున్నట్లు తెలుస్తోంది ఇందులో 40 మందిని పూర్తిగా పక్కన పెడుతుండగా.. మరో 25చోట్ల జంబ్లింగ్ చేయబోతున్నారు.
వైస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డికి రాజకీయంగా సలహాలు అందిస్తున్న ఐపాక్ టీమ్.. గ్రౌండ్ లెవల్లో పార్టీ పరిస్థితి బాగోలేదని సర్వే రిపోర్ట్ ఇచ్చింది. కనీసం 70స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలింది. ఐదు చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 65చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ నిర్ణయం జరిగి కూడా నెలరోజులకు పైగానే అవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మెసేజ్ను ఎప్పుడో చేరవేశారు కూడా.. విడతల వారీగా ఇప్పుడు.. అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు.