మంత్రి కొండా సురేఖ కు ఈసీ వార్నింగ్..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా అప్పుడప్పుడు అభ్యర్థులు తమ హద్దు దాటి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ పై ఎలక్షన్ కమిషన్ కాస్త సీరియస్ అయింది. బీఆర్ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ దీనికి కారణం. ఈ విషయంలో ఆమెకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ.. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సందర్భంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం మంచిదని సూచించింది.
అసలు విషయం ఏమిటంటే.. ఈనెల 1వ తారీఖున వరంగల్లో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా ఫోన్ టాపింగ్ చేసి ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని.. అధికారులను బదిలీ చేయించారని.. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లారని ఆమె తనకు తోచినట్లుగా మాట్లాడారు. ఇక దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్.. నిజా నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదు అని హితవు పలికారు. బాధ్యతాయుతమైన మంత్రిగా మాట్లాడుతున్న సమయంలో మరింత జాగ్రత్త వ్యవహరించాలని కొండా సురేఖకు ఈసీ తెలియపరిచింది. అలాగే మరొకసారి ఇటువంటి ఆధారం లేని ఆరోపణలు చేయవద్దని సూచించింది.