ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా? : యశ్వంత్ సిన్హా

ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం అని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్లో ఏర్పాటు చేసిన సభలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ముఖ్యమంత్రి కేసీఆర్ సవివరంగా చెప్పారని అన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు తెలిపారు. చాలా రోజులగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం అంతకాన్న కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం అన్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదన్నారు.
రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుంది. దేశానికి కేసీఆర్ వంటి నేత అవసరం. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్తు కోసం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేది. కేసీఆర్తో మరోసారి సమావేవమవుతా అని సిన్హా పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రతినిధులు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.