బీజేపీ సరికొత్త డిమాండ్.. ఇరకాటంలో పవన్..
గుడారంలో దూరిన ఒంటి ఎలా ప్రవర్తిస్తుందో… కూటమిలో చేరిన బీజేపీ కూడా రోజురోజుకీ అలా మారిపోతుంది. ఇదే కొనసాగితే ఒంటిని గుడారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ మొత్తానికి కూటమి బయటకు వెళ్లిపోతాడేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పటికే ఆరు ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు తన ఖాతాలో వేసుకున్న బీజేపీ మరొక సీటు కోసం చూస్తోంది. అయితే ఈ సీటు కూడా జనసేనాని ఖాతాలో నుంచే వెళ్తుంది అన్న టాక్ నడుస్తోంది. ఈ సీటు కూడా అడుగుతున్నది మరెవరి కోసమో కాదు బీజేపీ సీనియర్ నేత మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కోసం. తూర్పుగోదావరి జిల్లా నుంచి సోము వీర్రాజు ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అయితే ఆ సీటు దగ్గుపాటి పురందరేశ్వరికి ఇవ్వడం జరిగింది. దీంతో అలిగిన సోము ఇటీవల జరిగిన బీజేపీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. టీడీపీ ఇస్తానన్న అనపర్తి సీటు నుంచి పోటీ చేయడానికి సోము ఇష్టపడడం లేదు. తనకు ఎంతో కొంత పట్టు ఉన్న రాజమండ్రి అర్బన్ లేక రూరల్ నుంచి సీట్లు ఆశిస్తున్నాడు. దీంతో బీజేపీ హై కమాండ్ టిడిపి పై ఓ రేంజ్ ఒత్తిడిని తీసుకువస్తుంది. ఇక లాభం లేదు అనుకున్న చంద్రబాబు తన ప్లాన్ విని అమలు చేయడానికి రెడీ అవుతున్నారట. రాజమండ్రి సీట్లు ఇవ్వడం కుదరదు కాబట్టి దాని బదులు రాయలసీమ నుంచే మరొక సీటు ఇవ్వడానికి చంద్రబాబు చూస్తున్నారు. ఈ సీట్లలో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ..మరొకటి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట. రాజంపేట సీటు జనసేన ఖాతాలో ఉంది కాబట్టి.. దాన్నే బీజేపీ కి ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ తన డిమాండ్ పెంచిన ప్రతిసారి చంద్రబాబుకు ఎటువంటి నష్టం కలగడం లేదు.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజీ పడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో జనసైనికులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.