తన జీవితంలో మరిచిపోలేని ఘటన : కేంద్రమంత్రి షెకావత్
తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరగుతోందని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ధ్వజమెత్తారు. యాదాద్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా షెకావత్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. అణగారిన కులాలంటే కేసీఆర్కు గిట్టదన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఆ ప్రాజెక్టు కేసీఆర్కు డబ్బు సంపాదించే మిషన్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పరులను జైల్లో వేసేందుకు బీజేపీకి అధికారం ఇవ్వాలన్నారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామని షెకావత్ స్పష్టం చేశారు.