సీట్లపై ఇప్పటికీ కూటమిలో గందరగోళం..! మార్పులు-చేర్పులకు అవకాశం..!!
వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టాయి. కచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్లా అభ్యర్థులను ప్రకటించేసింది. వాళ్లంతా ప్రచారంలో మునిగిపోయారు. అయితే కూటమిలో మాత్రం ఇప్పటికీ కొన్ని స్థానాలపై క్లారిటీ లేదు. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో తెలియట్లేదు. క్లారిటీ వచ్చిన చోట్ల మాత్రం టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ, జనసేనలో మాత్రం ఇప్పటికీ గందరగోళం కనిపిస్తోంది.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సీట్లు పంచుకున్నాయి. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకుంది. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇందులో టీడీపీ ఇప్పటివరకూ 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఐదు అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన దాదాపు 11 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలపై క్లారిటీ ఇచ్చింది. ఇంకా పది అసెంబ్లీ స్థానాలపై అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. మొత్తంగా కూటమిలో 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలపై గందరగోళం నెలకొంది.
క్లారిటీ రాని అసెంబ్లీ స్థానాల్లో పాలకొండ, ఎచ్చెర్ల, చీపురుపల్లి, భీమిలి, పాడేరు, పి.గన్నవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, కైకలూరు, దర్శి, ఆలూరు, ఆదోని, గుంతకల్లు, అనంత అర్బన్, ధర్మవరం, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, రైల్వే కోడూరు ఉన్నాయి. ఇక పార్లమెంటు స్థానాలను పరిశీలిస్తే.. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, కడప, తిరుపతి అనంతపురం, రాజంపేట ఉన్నాయి. వీటిలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేదానిపై గందరగోళం నెలకొంది.
ఇప్పటివరకూ గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని అన్ని స్థానాపై క్లారిటీ వచ్చేసింది. అయితే కడప జిల్లాలో ఇంకా నాలుగు స్థానాలపై క్లారిటీ లేదు. అనంత, కృష్ణా జిల్లాల్లో మూడేసి స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంది. శ్రీకాకుళం, విశాఖ, కర్నూల్ జిల్లాల్లో రెండేసి స్థానాలు, విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం పెండింగ్ లో ఉన్నాయి. టీడీపీ ఖాతాలో ఉన్న చీపురుపల్లి, భీమిలి, దర్శి, గుంతకల్లు, ఆలూరుకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. జనసేన-బీజేపీ ఖాతాలో ఎచ్చెర్ల, పాడేరు, పి.గన్నవరం, విజయవాడ వెస్ట్, కైకలూరు, ఆదోని, అనంత అర్బన్, ధర్మవరం, బద్వేలు, రైల్వే కోడూరు, రాజంపేట ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీట్లు, అభ్యర్థులపై గందరగోళం నెలకొంది.
ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన పి.గన్నవరం స్థానం ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నట్టు సమాచారం. తిరుపతి అభ్యర్థిపై జనసేనలో సెగలు రేగుతుండడంతో అభ్యర్థిని మార్చవచ్చని సమాచారం. ఇందులో భాగంగా బీజేపీ, జనసేన కొన్ని సీట్లను మార్చుచుకునే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి, రాజంపేట, రైల్వే కోడూరు, ధర్మవరం, అనంత అర్బన్, విజయవాడ వెస్ట్ స్థానాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉన్నట్టు సమాచారం.