ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఎన్ రైజ్ ఏపీ క్యాంపైన్
ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునేలా చైతన్యం నింపేందుకు ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్ సిద్ధం చేసినట్లు ఎన్నారై టీడీపీ నేత వేమూరి రవి పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్ పేరుతో 25 ఎన్నికల ప్రచార వాహనాలను ఎన్నారై టీడీపీ విభాగం అధ్యక్షులు వేమూరి రవి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం సరికొత్త విధానంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. 4 రీజియన్లలో 25 పార్లమెంటు వారిగా 175 నియోజకవర్గాలలో ఎన్రైజ్ ఏసీ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాల వాగ్దానంతో యువతను మేలుకొలుపుతామని తెలిపారు. నియోజకవర్గ ఎన్నారై విభాగం టీమ్, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో ఎన్నారై టీడీపీ సభ్యులు క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఐదేళ్ల చీకటిపాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో, రాష్ట్ర ప్రజలు ఏమీ కోల్పోయారో ఎన్రైజ్ ఏపీ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ ఎన్నారై టీడీపీ ప్రెసిడెంట్ రాధా కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ పాల్గొన్నారు.