న్యూయార్క్ లో తానా ఇండిపెండెన్స్ డే వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను న్యూయార్క్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాసౌ కౌంటీ ఎగ్జిక్యూటివ్ లారా కర్రన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా పాల్గొన్నారు. ముఖ్య అతిధి లారా కర్రన్ జండావందనం చేసి మాట్లాడారు. తానా చేస్తున్న వివిధ సేవాకార్యక్రమాలను కొనియాడుతూ ఇంకా కొనసాగించాలంటూ కోరారు. స్థానిక రాజకీయవేత్త మరియు వ్యాపారవేత్త రాగిణి శ్రీవాత్సవ ఈ సందర్భంగా తానా న్యూయార్క్ టీంని అభినందించారు. మహిళల కొసం ప్రత్యేకంగా త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, రింగ్ లాంటి క్రీడలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలలో గెలిచినవారికి జ్ఞాపికలు అందజేశారు. భారతీయ మరియు అమెరికా జాతీయగీతాలను శృతి ఆలపించారు. తానా న్యూయార్క్ ప్రాంతీయ కార్యదర్శి దిలీప్ ముసునూరు మాట్లాడుతూ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు ఉపాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మద్దతుతో ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతమవ్వడంలో సహకరించిన తానా న్యూయార్క్ టీం మరియు హాజరైనవారికి ధన్యవాదాలు తెలియజేసారు.