తెలుగు విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇచ్చిన తానా
తానా ఫౌండేషన్, డల్లాస్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్ధులకు స్కాలర్ షిప్లు అందించారు. గత పదిహేనేళ్లుగా తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ మాట్లాడుతూ.. తానా చేపడుతున్న అనేక కార్యక్రమాల వల్ల సమాజంలో ఎంతో మందికి లబ్ధి కలుగుతుందన్నారు.
ఈ సంవత్సరంలో భాగంగా మార్చి 3న డాలస్ లో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 మంది తెలుగు విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందజేశారు. స్థానిక మైత్రీస్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వాగతోపన్యాసం చేసారు. అనంతరం ‘విద్య జీవితానికి వెలుగునిస్తుంది’ అనే నినాదంతో తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు, మురళి వెన్నం, పూర్వాధ్యక్షులు ప్రసాద్ తోటకూర, లోకేష్ నాయుడు, తానా ఫౌండేషన్ బృందం సారధ్యంలో అర్హులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. డా. ప్రసాద్ కాకర్ల సహకారం అందించారు.
సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తానాలాంటి స్వచ్చందసంస్థకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన దాతలు కార్యకర్తలకు తానాఫౌండేషన్ బృందం ధన్యవాదాలు తెలిపింది. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తానా ఫౌండేషన్ తెలిపింది.