రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే మా లక్ష్యం: రాహుల్ గాంధీ
దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు జరుగుతున్న ఎన్నికలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తుంటే.. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి శ్రమిస్తున్నాయని.. అందుకే ప్రజలు తమ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ మేరకు ఓటర్లను ఉద్దేశించి ఎక్స్లో గురువారం ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాము ప్రజల సమస్యలు, ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా మేనిఫెస్టోను రూపొందించామన్నారు. తాను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశానని, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పర్యటించానని, అందుకే దేశంలోని ప్రజలందరి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ‘‘మా మేనిఫెస్టోలో 5 ప్రధాన గ్యారెంటీలను అందించాం. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి దేశానికి 22-25 మంది మిలియనీర్లను తయారు చేశారు. కానీ మేము అధికారంలోకి వస్తే కోట్లాది మహిళలు, యువతను లక్షాధికారులుగా మారుస్తాం. రైతులకు కనీస మద్దతు ధర అందిస్తాం. మాది విప్లవాత్మక మేనిఫెస్టో. ప్రజల కోసం రూపొందించిన మేనిఫెస్టో. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతను నిర్వర్తించండి. కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని గెలిపించండి’’ అంటూ రాహుల్ గాంధీ ఓటర్లను కోరారు.