శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉద్ఘాటన సందర్భంగా మార్చి 21 నుంచి జరగాల్సిన మహాసుదర్శన నారసింహ యాగం వాయిదా వేసినట్లు యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధాన ఆలయం, గర్భాలయ ప్రారంభోత్సవం యథావిధిగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం యాగం మాత్రమే వాయిదా పడిందన్నారు. యాగ నిర్వహణకు అవసరమైన వసతులు పూర్తి కాకపోవడంతో మహాసుదర్శన యాగాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. మహాసుదర్శన యాగం మేలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ యాగం నిర్వహణపై సీఎం కేసీఆర్ గతేడాది అక్టోబర్ 19న యాదగిరిగుట్ట పర్యటన సమయంలో ప్రకటన చేశారు. ఆలయ ప్రారంభ కార్యక్రమం మొత్తం చినజీయర్స్వామి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.
యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో సుదర్శన యాగం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఆలయ అర్చకులకు అప్పట్లో తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణకు చినజీయర్ సూచనలతో విద్యత్, సిద్దాంతుల సభలో ముహూర్తం నిర్ణయించడం జరిగిందని, మహాసుదర్శన యాగంతోనే ఇది ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరాయణ పుణ్యాకాలంలో సహస్రాళ్ట 1008 కుండాలతో యాగం జరుగుతుందని, 6 వేల మంది రుత్వికులు, 3 వేల మంది సహాయకులు యాగం చేస్తారని నాడు ప్రకటించారు. చినజీయర్ పీఠంలో శ్రీమద్రమానుజుల 1004 సంవత్సరాల సందర్భంగా మహాసుదర్శన యాగం నిర్వహిస్తారని, అది పూర్తి కాగానే యాదాద్రిలో ప్రారంభమవుతుందన్నారు.