జోడెద్దులు సజావుగా సాగేనా?
కర్నాటక సీఎం పదవి వ్యవహారంలో పీటముడి వీడిపోయింది. సుదీర్ఘమంతనాలతో డీకె శివకుమార్ ను అతికష్టమ్మీద హైకమాండ్ ఒప్పించగలిగింది. ఆయనను శాంతింపజేయడానికి సీఎం పదవి షీట్ షేరింగ్ తో పాటు కోరిన మంత్రిపదవులు ఇచ్చింది. దీంతో అలకవీడిన డికె... రాజీ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. ఓవైపు మీ మాటే శిరోధార్యమంటూనే.. వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదంటూ సున్నితంగా హెచ్చరికలతో అధిష్టానాన్ని డికె దారికి తెచ్చుకున్నారని చెప్పక తప్పదు..
ఇప్పుడు అసలు కథ మొదలు కానుంది. సాదారణంగా ఓసారి ఎవరైనా సీఎం పదవి అధిష్టిించిన తర్వాత దాన్ని వదులుకునేందుకు అస్సలు ఇష్టపడరు. మరి రెండేళ్లపాటు పదవిని అనుభవించిన తర్వాత సిద్ధరామయ్య.. ఒప్పందం ప్రకారం నడుచుకుంటే పర్వాలేదు.. కానీ ఎదురు తిరిగితే.. దీనిికి కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మార్గముందా? అంటే లేదనే అర్థమవుతోంది. మరి అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏ చేస్తుంది..? కర్నాటకలో అపార ప్రజాబలం, ఎమ్మెల్యేల బలమున్న సిద్ధూ.. అంతఈజీగా తలొగ్గుతారా..? కాంగ్రెస్ లోనూ ఓమూలన ఈభయం వేధిస్తోంది. కానీ ఏం చేస్తారు... ఇప్పటికీ సమస్య నుంచి గట్టెక్కితే అంతే చాలురా దేవుడా అన్న పరిస్థితిలో హస్తిన పెద్దలున్నారు.
ఇక శివకుమార్.. అసలే మొండివాడు. పైగా ఇచ్చిన మాట ప్రకారం సిద్ధరామయ్య.. ప్రవర్తించకపోతే.. ఊరుకుంటాడా పార్టీని చీల్చేసినా ఆశ్చర్యం అక్కరలేదు. ఈడీ, సీబీఐలను తనపైకి వదిలినా భయపడేది లేదని మోదీకి ఎదురుగా నిలిచిన శివకుమార్.. కాంగ్రెస్ ను వదలిపెడతాడా? ప్రశ్నేలేదు.. తన హక్కుకోసం ఎంతకైనా వెనకాడని నైజం శివకుమార్ ది. అప్పుడు శివకుమార్ ను దారికి తేగలిగిన పరిస్థితి కాంగ్రెస్ కు ఉందా అంటే అదీ అనుమానమే.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జోడెద్దుల బండి ఎలా సాగుతుందో వేచి చూడాలి.
ప్రస్తుతం విజయానందంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని.. భవిష్యత్ మాత్రం భయపెడుతోంది. ఇద్దరూ ఉద్దండులే.. ఇద్దరూ పార్టీకోసం కష్టపడినవారే.. ఎవరినీ కాదనే పరిస్థితి లేదు. మరి పార్టీని సంక్షోభం నుంచి గెలిపించినవారే... తేడా వస్తే కిందపడేసే పరిస్థితి ఉందన్నది రాజకీయ పరిశీలకులమాట.