సీఎం రేవంత్ మోసంతో దాని విలువ పోయింది : హరీశ్ రావు
బీఆర్ఎస్ హయాంలో మెదక్కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వంలో మంజీరాపై చెక్డ్యామ్లు కట్టినందునే పంటలు ఎండిపోలేదు. ఈ ప్రాంతానికి మూడు మెడికల్ కళాశాలలు తీసుకువచ్చాం. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్ రాసిచ్చారు. గతంలో బాండ్ పేపర్కు విలువ ఉండేది. సీఎం రేవంత్ మోసంతో దాని విలువ పోయింది. ప్రజలు నమ్మడం లేదని ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారు. రేవంత్ ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేయాలి. కేంద్రంలో బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదు. పేదల గురించి బీజేపీ ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పార్టీ మాట నమ్మితే నీళ్లు లేని బాలిలో దూకినట్లే అని అన్నారు.