గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు : సీఎం రేవంత్
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక్క ఓటు వేసినా వృథానే అవుతుందని అన్నారు. కారు కార్ఖానాకు పోయిందని, దానిని బజారులో తూకానికి అమ్మాల్సిందేనని వ్యాఖ్యానించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. హామీల గురించి అడిగితే నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే బీజేపీ 400 సీట్లు కావాలని ఆంటోంది. అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారు. అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్కు పంపించారు. నన్ను అరెస్టు చేయాలని ఆదేశించారు. గుజరాత్ పెత్తనామా? తెలంగాణ పౌరుషమా? తేల్చుకుందాం. ఢిల్లీ పోలీసుల్ని కాదు, సరిహద్దులో సైనికుల్ని తెచ్చుకున్నా భయపడను. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు అని ఆరోపించారు.