పేదలకు పీఎంఏవై గృహాలు అందజేస్తూ.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ!
మహారాష్ట్రలోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) - అర్బన్ పథకం కింద నిర్మించిన 90 వేల గృహాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే సోలాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘పీఎంఏవై స్కీంలో భాగంగా నిర్మించిన సొసైటీల్లో దేశంలోనే అతిపెద్ద దాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. నేను 2014లో మీకు ఇచ్చిన మాటను ఇప్పుడు ఇలా వచ్చి నిలబెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గృహాలన్నీ చూస్తుంటే.. నా చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఇళ్లు ఉండి ఉంటే బాగుండేదని అనిపించింది,’ అని మోదీ చెప్పారు. ఈ పీఎంఏవై గృహాల లబ్దిదారులంతా పేదవారే అనే విషయాన్ని కూడా మోదీ గుర్తుచేశారు. ‘నేను ఈ ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలోనే చెప్పా.. మీ ఇంటి తాళం చెవులు ఇచ్చేందుకు మళ్లీ నేను వస్తానని. ఇప్పుడు మోదీ తన మాట నిలబెట్టుకున్నాడు కదా. గుర్తుంచుకోండి.. మోదీ గ్యారంటీ అంటే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామనే హామీ’ అని మోదీ తెలిపారు. అదే విధంగా పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.