ఆర్ఆర్ఆర్ తో గర్వపడితే.. డబుల్ ఆర్ తో దేశం సిగ్గుపడుతోంది : మోదీ
భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అబద్దాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుంది. ఆ పంచ సూత్రాలు అవినీతి, అబద్దాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని ఆ పార్టీ చూస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి మీ అందరికి తెలుసు. ఈ రోజు తెలంగాణ డబుల్ ఆర్ ట్యాక్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యాపారులు, గుత్తేదార్లు దాడిదారిలో ఈ ట్యాక్స్ కడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడితే డబుల్ ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడుతోదన్నారు.
పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్తో ఢల్లీికి కప్పం కడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎలా అవినీతికి పాల్పడి తెలంగాణను దోచుకుందో, ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది. దీనిని అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వారసత్వ సంపద నుంచి కొత్త ట్యాక్స్ వసూలు చేస్తామంటున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుంచి 55 శాతం మన పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కుట్రలు పన్నుతోంది. ఇలాంటి భయానక నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ దోచుకుందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ బీఆర్ఎస్ను కాపాడేందుకు ప్రయ్నిస్తోంది. అవినీతిలో ఈ రెండు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు.