సీఎం కేసీఆర్ వెన్నంటే తెలంగాణ ప్రజలు : కవిత
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉంటారనే విషయం మరోసారి రుజువైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్పై విమర్శలు చేసే వారికి మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు అని తెలిపారు. మునుగోడులో సీఎం కేసీఆర్ను ఆశీర్వదిస్తూ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇన్ని రోజులూ అవాకులు, చవాకులు మాట్లాడిన అనేక మంది నోళ్లు మూతపడేలా చేశారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాం. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ప్రజలు తప్పకుండా కేసీఆర్ పక్షాన ఉంటారనే విశ్వాసం నాకుంది అని కవితా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.