మాస్టర్ మైండ్...
దేశం యావత్తూ ఉలిక్కిపడేలా ప్రజాస్వామ్య దేవాలయంలో అలజడి రేపిన ఘటనపై ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో నిందితుల గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్సభలో పట్టుబడిన మనోరంజన్ అనే వ్యక్తే ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ అని పోలీసు వర్గాలు తేల్చాయి. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇందులో మనోరంజన్, సాగర్శర్మ లోక్సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ మనోరంజనే అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్.. మైసూరు ఎంపీ నుంచి పార్లమెంటులో ప్రవేశానికి పాస్ తీసుకున్నాడు. సాగర్ శర్మను తన స్నేహితుడిగా చెబుతూ అతడికీ పాస్ ఇప్పించాడు. అతడి పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో మనోరంజన్ ...పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మనోరంజన్ .. నక్సల్స్ భావజాలంతో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన సమయంలో లలిత్ కూడా పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్ సమీపంలో నీలమ్, అమోల్ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్ ఫోన్లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే.. నిందితులదరి ఫోన్లతో లలిత్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం ఆ వీడియోను పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ ఎన్జీవో సభ్యురాలికి పంపినట్లు సమాచారం. గతంలో లలిత్ మా ఎన్జీవోతో కలిసి పనిచేశాడు. పార్లమెంట్ వద్ద ఆందోళనకు సంబంధించి నాకు వాట్సప్లో ఓ వీడియో షేర్ చేశాడు. దాన్ని వైరల్ చేయమని మెసేజ్ చేశాడు’’ ఆ ఎన్జీవో తెలిపారు.
‘ఉపా’ చట్టం కింద కేసు..
ఈ ఘటనలో నిందితులపై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. వీరిని పూర్తిస్థాయిలో విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు.