టాలీవుడ్ లో విషాదం.. తారకరత్న మృతి
సినీ నటుడు తారకరత్నమరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. బెంగుళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూశారు. జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు.
తారకరత్న భౌతిక కాయం బెంగుళూరు నుంచి నేడు రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకుంది. అక్కడి నుంచి సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్కు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తారక రత్న మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.