చైనా కుయుక్తులు..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలపై చైనా కన్నేసిందా..? ఆయా దేశాల్లో జరిగే ఎన్నికలకు విఘాతం కలిగించేలా ప్రయత్నాలు చేస్తోందా..? అంటే అవుననే అంటోంది దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్.. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అస్త్రంతో దాడులకు వ్యూహాలు పన్నుతోందని ఆరోపించింది. ఇందుకు సైబర్ దాడులను ఎన్నుకున్నట్లు తెలిపింది. ప్రజాస్వామ్యానికి జీవనాడులుగా భావించే ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ హెచ్చరిక చేసింది.
మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ ప్రకారం.. చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూప్లు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు డ్రాగన్ సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్ కంటెంట్ను వాడనుందని మైక్రోసాఫ్ట్ టీమ్ పేర్కొంది. పొరుగున ఉన్న ప్రజాస్వామ్యదేశాల ఎన్నికలు విఘాతం కలిగించేలా ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలు చైనాపై దశాబ్దాల కాలం నుంచి ఉన్నాయి. ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉండేవారికి లబ్ధి చేకూరేలా ప్రయత్నాలు చేస్తోందని కొన్నాళ్లుగా బాధిత దేశాలు గొంతెత్తి వినిపిస్తున్నాయి. ఇదే విషయమై అమెరికా, రష్యాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలున్నాయన్న అనుమానాలున్నాయి. ఈతరుణంలో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటనచేసింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాలను హెచ్చరించింది కూడా.. తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఉత్తర కొరియాతో కలిసి ఈ చర్యలకు పాల్పడనుందని ఆ సంస్థ థ్రెట్ అనాలసిస్ సెంటర్ జనరల్ మేనేజర్ క్లింట్ వాట్స్ బ్లాగ్ పోస్టు పెట్టారు. అలాగే ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి, యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలను ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు ఏఐ వినియోగాన్ని పెంచిందని స్పష్టం చేశారు.
ఇటీవల ప్రధాని మోడీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఏఐతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల గురించి చర్చించారు. ‘‘ఏఐ శక్తిమంతమైనదే. కానీ.. సరైన శిక్షణ లేకుండా దీన్ని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ఫేక్ను ఎవరైనా వినియోగించొచ్చు. డీప్ఫేక్తో నా గొంతును కూడా అనుకరించారు’’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఏఐ పెద్దఅవకాశమని.. అయితే సవాళ్లు ఉన్నాయని బిల్గేట్స్ హెచ్చరించారు.