కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వం: కేటీఆర్
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ కీలక సమయంలో పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను తర్వాత కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలోకి రానివ్వమని బీఆర్ఎస్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్టీ వదిలి పోతున్న నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని, నిన్న, మొన్నటివరకు తాము అధికారంలో ఉన్నప్పుడు తమతో ఉన్న కొంతమంది నేతలు, నేడు అధికారం పోగానే వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వదిలి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మహేందర్రెడ్డికి పదవి ఇచ్చినా పార్టీ మారాడని మండిపడ్డారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటూ ధ్వజమెత్తారు. మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డిల ఓటమికి మహేందర్ రెడ్డి కుటుంబమే కారణమని ఆరోపించారు. మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీతలు వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో సొంత అడ్డాలు పెట్టుకుని వెన్నుపోటు పొడిచి సొంత నాయకులనే ఓడించారని నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉంటే.. వెన్నుపోటుదారులపై ఎక్స్ వేదికగా కూడా కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్. ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.