సీఎంగా చేసిన పాపాలే కేసీఆర్ను చుట్టుముట్టాయి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు చేసిన పాపాలే కేసీఆర్ను చుట్టుకున్నాయని కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎన్నో తప్పులు చేశారని, వాటివల్ల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు నాశనం అయ్యాయని, వేల కోట్లు దోచేశారని కోమటిరెడ్డి ఆరోపించారు.
యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని, యాదగిరి గుట్టలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించిన కోమటిరెడ్డి.. లోక్సభ ఎన్నికల తర్వాత యాదాద్రి అక్రమలపై విచారణ చేపడతామని, అలాగే యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని హామీ ఇచ్చారు. ‘‘దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు కేసీఆర్. ఆయన చేసిన పాపాల వల్లే రాష్ట్రంలో కరవు వచ్చింది. కాంగ్రెస్ పాలనలో కరువు అంటే తెలియదు. కాంగ్రెస్ అంటే వర్షం. వర్షం అంటే కాంగ్రెస్’’ అంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు కోమటిరెడ్డి.
అనంతరం పార్టీలో చేరికల గురించి మాట్లాడుతూ.. గేట్లు తెరవకముందే ఇతర పార్టీల నేతలు మూకుమ్మడిగా కాంగ్రెస్లోకి వస్తున్నారని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాను కేసీఆర్ నాశనం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారని ప్రశ్నించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలోనూ చూడలేదని, కేసీఆర్ అధికారులతో పాపపు పనులు చేయించారని, దీంతో ఆ అధికారులు ఇప్పుడు భయంతో నిద్రపోవడం లేదని, కేసీఆర్ ప్రతి విషయంలోనూ రాజకీయం చేశారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు.