పిఠాపురం నుంచే పవన్ ఎన్నికల ప్రచార శంఖారావం!
దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగుతుండడంతో ఆ కోలాహలం మరింత ఎక్కువైంది. రెండింటిలోనూ మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో పార్టీలన్నీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంటే.. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని ట్రై చేస్తోంది. కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
వారం కిందటి వరకూ పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. అయితే తాను పిఠాపురం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు పవన్ ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిఠాపురం సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేత వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణే బరిలోకి దిగుతుండడంతో సర్దుకుపోయారు. చంద్రబాబు హామీతో ఆయన పవన్ కల్యాణ్ కు సహకరించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు ఇబ్బందులు తొలగినట్లయింది.
పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రచారాన్ని పిఠాపురం నుంచే ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. శక్తిపీఠం కొలువైన నేల పిఠాపురం. శ్రీపాద శ్రీవల్లభుడు కొలువైన క్షేత్రంలో పురుహూతికా దేవికి, వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రచారం షురూ చేయబోతున్నట్టు పవన్ వెల్లడించారు. పిఠాపురంలో మూడు రోజులు ప్రచారం చేయనున్నారు. పిఠాపురంపై సమీక్ష అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటనకు వెళ్లనున్నారు.
గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనుకుంటున్నారు. అందుకే పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు వైసీపీ సోషల్ ఇంజినీరింగ్ చేస్తోంది. కాపులు ఓటేయరని భావిస్తున్న వైసీపీ బీసీ, మత్స్యకారులను మచ్చిక చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే కూటమి నేతలంతా వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని, అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.