మా చెల్లెలు బాబాయి హంతకున్ని సమర్థిస్తున్నారు.. జగన్
రాబోయే ఎన్నికలకు ప్రచారం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంవత్సరాలు తాను చేసిన ప్రగతి గురించి మాట్లాడడమే కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలు కురిపిస్తున్నారు. 58 నెలల తన పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రంగంలో మార్పులు తీసుకువచ్చామని ఆయన తెలియపరచారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని.. పేదల భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నిస్తున్న తనపై ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు. తనను ఓడించడానికి సొంత చెల్లెలు పగవారికి సపోర్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా జగన్ అన్నారు. తన బాబాయిని హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసు అన్న జగన్.. తన చెల్లెలు మాత్రం హంతకుడిని సపోర్ట్ చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఇప్పుడు టీడీపీ చెబుతున్న మేనిఫెస్టోలు మొత్తం చంద్రబాబు గెలిచాక చెత్తబుట్టకే పరిమితం అవుతాయని ఎద్దేవా చేశారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అందరు కూడా తమ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.