చంద్రయాన్ -4..

చంద్రయాన్ -3 విజయంతో భారత్ ప్రపంచ అంతరిక్షరంగంలో దూసుకెళ్లింది. దీంతో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా సరసన చేరింది. అయితే దానికి కొనసాగింపుగా చంద్రయాన్ -4కు రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్-4 /లూపెక్స్ పేరుతో చేపట్టే ఈ ప్రయోగంలో భాగంగా చందమామ నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఇస్రోకు చెందిన ‘స్పేస్ అప్లికేషన్స్ సెంటర్’ డైరెక్టర్ నీల్ దేశాయ్ పుణెలో వివరించారు. చంద్రయాన్-4‘‘ చంద్రుడి ఉపరితలంపై లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ (లూపెక్స్)ను సిద్ధం చేస్తున్నాం.
చంద్రయాన్-3లోని ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగింది. చంద్రయాన్-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది. ఇందులో 350 కిలోల బరువున్న రోవర్ను పంపనున్నాం. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగుతుంది. చంద్రయాన్-3 మిషన్ జీవిత 14 రోజులు కాగా.. చంద్రయాన్-4 సుమారు వంద రోజులు పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజక్టు కోసం రెండు వాహకనౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది’’ అని నీల్ దేశాయ్ వెల్లడించారు. దీని నిమిత్తం జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు.
అయితే చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాల సేకరణ, పరిశోధనల్లో అమెరికా, రష్యా చాలా పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే అక్కడ నీళ్లు, మానవ సమూహల నివాసానికి అవకాశాలపై అన్వేషణ సాగుతున్నాయి. అయితే లేటుగా అయినా లేటెస్టుగా పోటీలో వచ్చి చేరిన భారత్ మాత్రం.. వీటికి భిన్నం ఎవరూ టచ్ చేయని దక్షిణ అక్షాంశం వద్ద నుంచి మట్టి, రాళ్ల నమూనాలు సేకరించనుంది. ముఖ్యంగా అత్యంత విలువైన ఖనిజాలు. గ్యాసెస్ గురించి పరిశోధనలు చేయనుంది.
ఈ ప్రాజెక్టును సజావుగా నిర్వహిస్తే, ఇస్రో... అంతరిక్షరంగంలో ప్రపంచదేశాలకు మరింత గట్టిపోటీ ఇవ్వనుంది.ఇప్పటికే నాసా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థలతో పోలిస్తే.. అతి తక్కువ ధరకు ఇస్రో... ప్రయోగాలు చేస్తోంది. దీంతో చిన్న, మధ్యతరహా దేశాలు... తమ అవసరాల కోసం ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి. అయితే చంద్రయాన్ -4 విజయం సాధిస్తే... వ్యాపారపరంగా పెద్దదేశాలు సైతం.. తమ అవసరాల కోసం ఇస్రోను ఆశ్రయించే పరిస్థితి వస్తుంది.






