ఉగ్రవాదంపై "రా" తంత్రం..?
విదేశాల్లో ఉగ్రవాదులు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. ఎవరు చంపుతున్నారో తెలియదు.. ఎందుకు చంపుతున్నారో తెలియదు. ఆరా తీస్తే... లోకల్ గ్రూపుల దాడిలో చనిపోయారంటున్నారు. దీంతో ఉగ్రతండాల్లో ఆందోళన తలెత్తుతోంది. అయితే ..ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికా గడ్డపై కుట్రపన్నిందని భారత్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో పదుల సంఖ్యలో కీలక ఉగ్రవాదులు చనిపోయారు. సొంతగడ్డపై పాక్ రక్షణలో ఉన్న ఉగ్రవాదులు చనిపోతుండడం.. అక్కడి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. వీరి హత్యల వెనక భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా హస్తముందని పాక్ ఆరోపించింది. అయితే పన్ను హత్య ప్లాన్ తర్వాత కెనడా సైతం ఇదే ఆరోపణలు గుప్పించింది. వీటిని భారతవిదేశాంగశాఖ ఖండించింది కూడా.. దీనిపై రగడ జరుగుతుండగానే .. ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామని ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ హెచ్చరించారు. అదే అంశాన్ని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పునరుద్ఘాటించారు.
దీంతో ఇది భారత ఇంటెలిజెన్స్ విభాగం ..రా చేపట్టిన రహస్య ఆపరేషన్ అని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పుల్వామా, ఉరీ దాడుల తర్వాత వ్యూహం మార్చిన భారత్..విదేశాల్లో ఉన్న ఉగ్రవాదుల్ని వారి పుట్టలోనే మట్టుపెట్టేలా వ్యూహరచన చేసిందని కథనాలు వెలువడుతున్నాయి. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా మరోసారి సూచించింది.
ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ అంతంచేస్తామని ఇటీవల ప్రధాని మోడీ , రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి భారత్కు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూఢిల్లీ లక్ష్యంగా చేసుకొందని బ్రిటన్కు చెందిన ‘ది గార్డియన్’ పత్రిక కథనంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపించింది. ఈ కథనాన్ని మన విదేశాంగశాఖ ఖండించింది. అదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది.