చెలరేగిర రోహిత్, కోహ్లీ.. భారత్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు!
వన్డే వరల్డ్ కప్లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆ టీంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (80), అజ్మతుల్లా ఒమర్జాయ్ (62) ఇద్దరూ అద్భుతంగా ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం భారత జట్టు లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131) ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్ కిషన్ (47) కూడా రాణించాడు. కిషన్ అవుటైన తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (55 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (25 నాటౌట్) కూడా చెలరేగారు. దీంతో భారత జట్టు కేవలం 35 ఓవర్లలలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచులో శతకంతో చెలరేగిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.